YS Sharmila: టూరిజం మంత్రి ఎవరు... రోజా అట కదా!: అరకులో షర్మిల వ్యాఖ్యలు

  • అరకులో కాంగ్రెస్ న్యాయ యాత్ర
  • ఆదివాసీల కోసం వైఎస్సార్ ఎన్నో పనులు చేశారన్న షర్మిల
  • ఇప్పుడు వారిని పట్టించుకునే వారే లేరని ఆరోపణ
  • రోజా మాత్రం జబర్దస్త్ గా ఉన్నారని వ్యంగ్యం 
YS Sharmila comments on Tourism minister Roja

ఏపీ న్యాయ యాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు 19వ రోజు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అరకులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ, నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసీల అభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టారని, కార్పొరేషన్ లోన్లు ఇచ్చారని, స్వయం ఉపాధి కల్పించారని, స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఉండేవని వివరించారు. కానీ ఇప్పుడు ఆదివాసీల గురించి పట్టించుకునే నాయకుడే లేడని అన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు జగన్ ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, వీళ్లిద్దరి పాలనలో అరకులో ఏం కొంచెమైనా అభివృద్ధి జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. 

"జగన్ రూ.600 కోట్లలో టూరిజం డెవలప్ మెంట్ చేస్తానన్నారట కదా! రూ.600 కోట్లలో ఒక కోటి అయినా వచ్చిందా? టూరిజం డెవలప్ మెంట్ మినిస్టర్ ఎవరు?... రోజా అట కదా...! జబర్దస్త్ రోజా... ఆమె మాత్రం జబర్దస్త్ గా ఉండాలి... అరకు ఏమైనా ఫర్వాలేదు... ఆమె ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదట కదా! ఒక్క రూపాయి ఇచ్చిందీ లేదట... మరి ఎందుకన్నా వీళ్లకు ఓటేయాలి? అరకులో పర్యాటకం అభివృద్ధి జరిగుంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి, ఎన్ని అవకాశాలు ఏర్పడేవి! బీజేపీ వాళ్లు ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ తెస్తాం అన్నారు... తెచ్చారా? ఇక్కడ మెడికల్ కాలేజీ అన్నారు... అదీ రాలేదు, ఇంజినీరింగ్ కాలేజీ కూడా రాలేదు... ఏ ఒక్కటీ రాలేదు" అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.

More Telugu News